రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక: సి.ఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ, పర్యాటక శాఖ సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సి.ఎస్ కు వివరించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎకో టూరిజం ను అభివృద్ధి పరచి తద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంతో పాటు పర్యటక రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఉన్న కిన్నెరసాని, శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతాలలో అమ్రాబాద్, గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధికి తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎకో టూరిజం ను అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రంలో విలువైన అటవీ సంపద ఉందని, జీవ వైవిధ్యం, సహజ ప్రకృతి అందాలను పర్యాటక అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టులు రూపొందిస్తే , ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జి.డి.పి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవల్మెంట్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సి.ఎస్ సూచించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ , అనంతగిరి ,వికారాబాద్,సిటీ అర్బన్ ప్రాంతాలలో ఎకో టూరిజంను ప్రొత్సహించాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, నిబందనలకు అనుగుణంగా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, PCCF వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.