రైతులందరూ తప్పనిసరిగా పాల్గొని శాస్త్రవేత్తల సూచనలు పొందాలి: వ్యవసాయ సంచాలకులు బి. గోపి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై 2026) 100వ ఎపిసోడ్‌కు చేరుకోనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమం గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అత్యంత ఉపయోగకరమైన వేదికగా నిలిచింది. రాష్ట్రంలోని రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసి, పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, చీడపీడల యాజమాన్యం, పోషక నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై శాస్త్రీయ సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులు నిపుణుల సలహాలను పొందుతూ శాస్త్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం నేరుగా చేరవేసే సమర్థవంతమైన వేదికగా ‘రైతు నేస్తం’ విశేష ఆదరణ పొందిందని వ్యవసాయ సంచాలకులు బి. గోపి, ఐఏఎస్ తెలిపారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నందున రైతులందరూ తమ సమీప రైతు వేదికకు హాజరై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు కోరారు.