మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా: మంత్రి వాకిటి శ్రీహరి

  • 4.21 లక్షలకుపైగా నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా
  • ప్రమాదవశాత్తు మరణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ
  • మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2026-27 సంవత్సరంలో 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని, తద్వారా అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

బీమా పథకం ద్వారా అందే ప్రయోజనాలు:
1. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే – రూ.5.00 లక్షలు
2. శాశ్వత సంపూర్ణ వైకల్యానికి – రూ.5.00 లక్షలు
3. శాశ్వత పాక్షిక వైకల్యానికి – రూ.2.50 లక్షలు
4. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందితే – గరిష్ఠంగా రూ.25,000 వరకు వైద్య సహాయం

    2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద సమయంలో అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా గ్రూప్ ప్రమాద బీమా పథకం కీలకమైనదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.