NH – 65 హైదరాబాద్ – విజయవాడ రహదారి 17 బ్లాక్ స్పాట్స్ ఫ్లై ఓవర్లు అతి త్వరలో పూర్తి చేయాలి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • చిట్యాల ఫ్లై ఓవర్ ఈ దసరా నాటికి పూర్తి చేయాలి
  • మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలి.. సంక్రాంతికి వాహనాల రాకపోకలు సాగాలి
  • నిత్యం జరుగుతున్న ప్రమాదాలు నివారించాలంటే రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలి
  • 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశాం
  • తెలంగాణ రాష్ట్ర అభివృద్దే మా ధ్యేయం..మాకు ఎలాంటి బేషజాలు లేవు
  • రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరొక్కసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలుస్తాం..అవసరమైతే ప్రధాన మంత్రిని కలుస్తాం
  • NH 65 విస్తరణ పనులతో పాటు ఇతర NHAI ప్రాజెక్ట్స్ త్వరగా చేపట్టాలని కోరతా
  • ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై,కొన్ని చోట్ల రహదారికి రెయిలింగ్ లేని వార్తలపై ఆరా తీసిన మంత్రి

హైదరాబాద్: హైదరాబాద్ – విజయవాడ రహదారి పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో గురువారం రోడ్లు భవనాల శాఖ పరిధిలోని పలు రోడ్లు, NH ప్రాజెక్ట్స్ పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి అధికారులను ఆరా తీశారు. హైదరాబాద్ – విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్ పై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు,హై మాస్క్ లైట్స్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు నిర్మాణ చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పెద్దకాపర్తి ఫ్లై ఓవర్ ఇప్పటికే ట్రాఫిక్ అనుమతిస్తుండగా,సూర్యాపేట ఈనాడు ఆఫీస్ వద్ద ఫ్లై ఓవర్ ట్రాఫిక్ అనుమతికి సిద్ధంగా ఉందన్నారు.

చిట్యాల ఫ్లై ఓవర్ ఈ దసరా నాటికి పూర్తి చేయాలనీ,మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. ఆ ఫ్లై ఓవర్ల నుండి ఈ సంక్రాంతికి వాహనాల రాకపోకలు సాగాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై,కొన్ని చోట్ల రహదారికి రెయిలింగ్ లేని వార్తలపై ఆరా తీసిన మంత్రి..NHAI అధికారులకు పలు సూచనలు చేశారు. మూగ జీవులు రహదారిపైకి రాకుండా రెయిలింగ్ తో పాటు,రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలు నివారించాలంటే ఈ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలన్నారు.6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్దే తమ ధ్యేయమని,అందుకోసం తమకు ఎలాంటి బేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరొక్కసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం..అవసరమైతే ప్రధాన మంత్రిని కలుస్తామన్నారు. NH 65 విస్తరణ పనులతో పాటు,బుల్లెట్ ట్రైన్స్,ఇతర NHAI ప్రాజెక్ట్స్ త్వరగా చేపట్టాలని కోరతామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సమీక్షలో ఆర్ అండ్ బి ఈఎన్సి లింగారెడ్డి,సి.ఈ లు వసంత్ నాయక్,ధర్మారెడ్డి, పలువురు NH అధికారులు ఉన్నారు.