- జూన్ 2న ఆదిలాబాద్ నుంచి రెండో విడత ప్రారంభం
- గూడులేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు
- జాయింట్ సర్వే తో భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్ : పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీకని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంతరెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు. గూడులేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయంతో (వంద శాతం సబ్సిడీతో) పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి తెలంగాణా ప్రభుత్వం దేశానికి తలమానికంగా నిలిచిందన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్ ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు, హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఖమ్మం ఇన్ ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు శ్రీమతి దాసరి అనసూయ సీతక్క, శ్రీమతి కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్, పార్లమెంటు సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పి.బలరాం నాయక్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరును విజయవంతంగా పూర్తి చేసి లక్షలాది పేద కుటుంబాల సొంత ఇంటి కలలను నెరవేర్చామని తెలిపారు. 3 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ కాగా, ఇందులో ఇప్పటికే సుమారు 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయని, అలాగే మరో రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని మరో రెండు నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయగా , ఐటిడిఎ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. వచ్చే నెల రెండో తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఇది ఇంతటితో ఆగిపోదని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే వరకు మూడవ, నాలుగవ విడతలుగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇరవై వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో ఆరువందలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లను నిర్మించిన వారి బిల్లులను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. పేదవాడు తాను నివశిస్తున్న పూరి గుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే , తమ ల్యాండ్ అంటూ ఫారెస్ట్ అధికారులు గానీ, సింగరేణి యాజమాన్యం కానీ అడ్డుపడొద్దని చెప్పారు. ఇండ్ల బేస్ మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి పేదల కోసం భూములను సేకరించి పట్టాలిచ్చారనీ , ఇందులో ఇంకా కొంత భూమి మిగిలే ఉందని దీనిని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ విభాగానికి సంబంధించి క్షేత్ర స్థాయిలోని స్థితిగతులపై ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోడానికి, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించే చర్యలు తీసుకునే క్రమంలోనే సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇండ్ల 2 విడత కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ముఖ్యంగా ఈ నెలాఖరుకల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 2 బిహెచ్ కె ఇండ్లన్నిటికీ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, పూర్తి పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకే లబ్ధి చేకూరేలా చూడాలని స్పష్టం చేసారు. డబుల్ బెడ్ రూం కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుత్, మంచినీరు, డ్రైనేజి వంటి వాటి పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న కాలనీల్లో టవర్ ను యూనిట్ గా తీసుకుని , లబ్ధిదారుల అసోసియేషన్ ల ద్వారా పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీభూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయని మంత్రి అన్నారు. రెండు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. దీంతో పాటు పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్టు మధ్య కూడా వివాదాలు ఉన్నాయని ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన రోవర్స్ తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో హౌసింగ్ సెక్రటరీ వి.పి. గౌతం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.