ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం: మంత్రి దుద్దిళ్ల. శ్రీధర్ బాబు

  • యూరియా లభ్యతను మరింత సరళతరం చేసిన ప్రభుత్వం
  • యాప్ లో బుకింగ్ చేసుకోలేనివారికి సులువైన మార్గం

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో పనిచేస్తున్న మీసేవ, వ్యవసాయశాఖతో కలిసి ఈ కొత్త చొరవను ప్రారంభిస్తుంది.

ఈసేవను పొందే విధానం:
• రైతు తన పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి.
• మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం మరియు పంట వివరాలను నమోదు చేస్తారు.
• రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు.
• రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన OTPను ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడి (Booking ID) జారీ చేయబడుతుంది.

ముఖ్యమైన సూచనలు:
• మీ సేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడి బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
• బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి.
• సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.
• OTP అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్ బుక్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి.
• కేవలం పదిరూపాయల నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
• ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ఈ సౌకర్యాన్ని రాష్ట్రంలోని రైతులందరూ వినియోగించుకొని, సబ్సిడీ యూరియాను అధికారిక బుకింగ్ విధానం ద్వారా పొందాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తోంది.