- బీఆర్ఎస్ నాయకత్వానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సవాల్
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు “క్లీన్ చీట్” ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి గారు తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి గారు అన్నారు. ఇదే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడం, పంప్ హౌజ్లు దెబ్బతినడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రాజెక్టులో జరిగిన పెద్ద ఎత్తున అవినీతికి నిదర్శనాలేనని పేర్కొన్నారు. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత దెబ్బతిందని, అదే విధంగా నిర్మించిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలిన ఘటనలు ప్రజల ముందు ఉన్న వాస్తవాలేనని మంత్రి గారు గుర్తు చేశారు.
లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నట్టుగా గ్లోబల్ ప్రచారానికి దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, ఇది టీఆర్ఎస్ పాలనలో పెరిగిన మాయాజాల రాజకీయాలే అని విమర్శించారు. నిజాన్ని దాచేందుకు ప్రచార యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్ మరియు కేటీఆర్ ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, విచారణ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారో చెప్పాలని మంత్రి గారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్ట్పై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరగడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. నిజం మీవైపు ఉంటే విచారణకు ముందుకు రావాలని లేకపోతే మీ భయం మీ తప్పును నిరూపిస్తుందన్నారు.