హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్డు ద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి తీసుకురావాలని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ఒకే కార్డులో పొందుపరిచేలా “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” (Unified Welfare Card)ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. “ఒకే కార్డు–అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి” అనే విధానంతో కార్యాచరణను రూపొందించాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. రేషన్, పెన్షన్, మహాలక్ష్మి, తదితర అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆ కార్డుకు అనుసంధానించి ప్రజలకు అందించే సేవలను సులభతరం చేయాలని, అలాగే ప్రజల డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిపై తగు ప్రణాళికను రాబోయే 10 రోజుల్లోగా సిద్ధం చేయాలని సిఎస్ సూచించారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, పెన్షన్ డేటా, ఆరోగ్య ప్రొఫైల్ వంటి సమాచారం కూడా ఈ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, ‘సిజిజి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రవిగుప్తా, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, రఘునందన్ రావు, సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి.ముకుందరెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్ టిసి ఎం.డి. నాగి రెడ్డి, సంయుక్త కార్యదర్శి (ITE&C) అనుదీప్ తదితర అధికారులు పాల్గొన్నారు.